Covid-19 antibodies : కొవిడ్ నుంచి కోలుకున్నాక బాధితుల శరీరంలో Covid Antibodies ఎన్ని నెలల వరకు ఉంటాయో తెలుసా? సాధారణంగా కరోనా సోకిన తర్వాత వైరస్ యాంటీబాడీలు దాదాపు 9 నెలల వరకు ఉంటాయట.. కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన తర్వాత బాధితుల్లో లక్షణాలు కనిపించినా లేదా అనేదానితో సంబంధం ఉండదట. అలాంటివారి శరీంలోనూ యాంటీబాడీస్ 9 నెలల పాటు ఉంటాయని అంటున్నారు. ఇటలీ, లండన్లోని ఇంపీరియల్ యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేశారు.
ఇటలీలో గత ఫిబ్రవరి, మార్చి నెలలో 3 వేల కరోనా బాధితుల డేటాను పరిశీలించారు. వారిలో 85 శాతం మంది బాధితుల్లో యాంటీబాడీల పరీక్షలు చేశారు. 2020 ఏడాదిలో మే నుంచి నవంబర్లలో మరోసారి బాధితులకు పరీక్షలు జరిపారు. అప్పుడు వారిలో యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. వారందరిలో 98.8 శాతం మంది రోగులలో యాంటీబాడీస్ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని తేలింది.
కరోనా లక్షణాలు లేకపోయినా యాంటీబాడీల స్థాయి మాత్రం ఎక్కువగానే ఉన్నాయని గుర్తించారు. కరోనా లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా యాంటీబాడీల స్థాయిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని కనుగొన్నారు. ప్రతి నలుగురు బాధితులలో ఒకరు కుటుంబంలో కరోనా వ్యాపికి కారణమవుతున్నారు.
యాంటీబాడీలు తయారైనా :
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలామందిలో వైరస్ లక్షణాల తీవ్రత తగ్గడం లేదు. వైరస్ ప్రభావం అలానే ఉంటోంది. కొంతమందిలో యాంటీబాడీలు తయారైనప్పటికీ అవి ఎంతకాలం ఉంటాయనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సాధారణంగా కరోనా యాంటీబాడీలు ఆరు నెలల నుంచి తొమ్మది నెలల వరకు ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కొక్కరిలో యాంటీబాడీల స్థాయి ఒక్కోలా ఉంటోంది. కొంతమంది వైరస్ బాధితుల్లో కరోనా సోకిన తర్వాత కోలుకున్నప్పటి నుంచి వారిలో యాంటీబాడీలు ఎంతవరకు ఉన్నాయి అనేది పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
కరోనా యాంటీబాడీలు కొవిడ్ వ్యాక్సిన్ల ద్వారా కూడా పొందవచ్చు. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోనివారిలో వైరస్ నుంచి కోలుకున్నాక సహజంగా యాంటీబాడీలు తయారవుతాయి. ఒకసారి కరోనా సోకిన తర్వాత మళ్లీ వారికి కరోనా సోకదని గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. కరోనా యాంటీబాడీలు శరీరంలో ఉన్నప్పటికీ వైరస్ సోకే ముప్పు తప్పదు. కాకుంటే.. వైరస్ ప్రభావం వారిపై తక్కువగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా యాంటీబాడీలు శరీరంలో ఉన్నంతమాత్రానా వైరస్ బారినుంచి బయటపడలేరని గుర్తించాలి. వైరస్ తీవ్రతను మాత్రమే తక్కువగా ఉంటుందని, వైరస్ వ్యాప్తిని మాత్రం కంట్రోల్ చేయలేము. కరోనా సోకినప్పటికీ వారికి ఎలాంటి ప్రాణాపాయం లేనప్పటికీ.. వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం లేకపోలేదు. అలా ఇతరులకు వీరి నుంచి కరోనా సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా లేకుంటే తీవ్ర అనారోగ్యాినికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నాక వారిలోని యాంటీబాడీలను మరొకరికి ప్లాస్మా థెరపీ ద్వారా అందించే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి కచ్చితమైన అధ్యయనాల్లో ఎక్కడా రుజువు కాలేదు. కొంతమేరకు ఈ థెరపీ విధానం వర్కౌట్ అయినట్టు చెబుతున్నారు.
ప్లాస్మా థెరపీతో యాంటీబాడీలు :
శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ సమర్థవంతంగా ఉన్నోళ్లలో కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కారణం.. వారి శరీరంలోకి కరోనా వైరస్ ఎంటర్ కాగానే.. వ్యాధినిరోధక వ్యవస్థ అలర్ట్ అవుతుంది. తెల్ల రక్తకణాలు వైరస్పై దాడి చేసి నాశనం చేసేస్తాయి. కరోనానుంచి పూర్తిగా కోలుకున్నాక రక్తంలోని రోగనిరోధక కణాల సంఖ్య అధిక స్థాయిలో పెరుగుతుంది. మరికొందరిలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది.
వారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే ఎలాంటి వైరస్ లైనా ఎదుర్కొగల శక్తి ఉంటుంది. కరోనా తీవ్రతను తట్టుకోలేని వారికి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తుంటారు. అంటే.. కొవిడ్ యాంటీబాడీలు అనమాట.. ఈ యాంటీబాడీల నుంచి సేకరించిన ప్లాస్మాను వైరస్తో బాధపడే ఇతర బాధితుల శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ప్లాస్మా థెరపీగా పిలుస్తుంటారు.
ప్లాస్మా థెరపీ విధానం ద్వారా దాత మరొకరికి దానం చేయాలంటే కరోనా నుంచి బాధిత వ్యక్తి పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి నుంచి ప్లాస్మాను సేకరించాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్నాక వారిలో అసలు యాంటీబాడీలు తయారయ్యాయా లేదో ఒకటికి రెండు సార్లు టెస్టులు చేయించాలి. వారిలో వైరస్ పూర్తిగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నాకే ఇతరులకు ప్లాస్మాను దానం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైద్యులు తప్పనిసరిగా నిర్ధారణ చేయాలి.
వైరస్ నుంచి కోలుకున్నాక 14 రోజుల వ్యవధిలో శరీరంలో కొవిడ్ యాంటీబాడీలు ఎంత మోతాదులో ఉన్నాయో ఎలసా అనే టెస్టు నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో యాంటీబాడీలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నాకే వారినుంచి ప్లాస్మాను సేకరించాలి. అంతేకాదు… ప్లాస్మా దాత రక్తాన్ని లోతుగా పరీక్షించాల్సి ఉంటుంది. వారిలో ఇతర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేమైనా ఉంటే.. అది రక్తం ద్వారా ఇతరులకు సంక్రమించే రిస్క్ ఉందని గుర్తించాలి.
అప్పుడే ప్లాస్మాను ఎక్కించాలి :
కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకే ప్లాస్మాను సేకరించాలి. అప్పుడు అస్పెరిసిస్ అనే సాంకేతిక విధానం ద్వారా బ్లడ్ సేకరిస్తారు. ఈ విధానంలో రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తారు. ఇక్కడ ప్లాస్మా అంటే.. బాగా తెలిసిన పదం.. ప్లేట్ లేట్స్ వేరు చేయడం జరుగుతుంది. మిగిలిన రక్తం ప్లాస్మా దాత శరీరంలోకి తిరిగి వెళ్లేలా చేస్తారు. ఎందుకంటే ప్లాస్మాలోనే రోగనిరోధక కణాలు నిండి ఉంటాయి. అయితే ఒకరి నుంచి ప్లాస్మాను 800 మి.లీ ప్లాస్మాను మాత్రమే తీస్తారు. ఒక్కొక్కరిలో నుంచి సేకరించిన 200 మిల్లీలీటర్ల ప్లాస్మాను మరో నలుగురి వరకు ఇవ్వవచ్చు.
అయితే ఇలా సేకరించిన ప్లాస్మాను కరోనాతో బాధపడే బాధితులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది తప్ప మరొకరికి ఇవ్వరాదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాతో వెంటిలేటర్లపై ఉండి శ్వాస తీసుకులేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాస్మా థెరపీ విధానాన్ని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ థెరపీ విధానం ద్వారా కరోనా బాధితులు కోలుకునేందుకు ఎంత సమయం అవుతుందో వెంటనే చెప్పలేమంటున్నారు వైద్యులు. సాధారణంగా ఒక బాధిత వ్యక్తి కోలుకోవడానికి 48 గంటల నుంచి 72 గంటల వరకు సమయం పట్టొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు.