Couple marriage problems : భారతీయ వైవాహిక జీవితానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రత్యేకత ఉంది. మన దేశంలో పెళ్లి అంటే ఒక బాండింగ్. రెండు కుటుంబాల ఆత్మీయ కలయిక. భారతీయ దాంపత్య జీవితంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కడవరకు ఇద్దరూ కలిసి ఉంటున్నారంటే ఇక్కడి సాంప్రదాయాలు, సంస్కృతి కారణం అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో జరిగే పెళ్ళిళ్లకు మన దగ్గర జరిగే వివాహాలకు చాలా తేడా ఉంటుంది.
చిన్నదానికే విడాకుల వరకు :
అక్కడ విడిపోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. ఏ చిన్న గొడవ జరిగినా దానిని సాకుగా చూపిస్తూ విడాకులకు అప్లై చేస్తుంటారు. అలాంటివి మన దేశంలో చాలా తక్కువ. మన దగ్గర కూడా దంపతుల మధ్య విబేధాలు రావడం కామన్. దానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ, విడిపోయేందుకు భారతీయులు ఎక్కువగా సాహసించరు.
కానీ, ఇటీవల విదేశీ కల్చర్ పెరిగిపోవడంతో అన్ని రెడీమెడ్ అయిపోయాయి. మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసుకోవడం, ఆన్ లైన్ ఎంగేజ్మెంట్స్, ముహూర్తాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు.. ఆ తర్వాత ఏ చిన్న గొడవ వచ్చినా పంచాయితీలు పెట్టడం, కోర్టు మెట్లెక్కడం ఇక్కడ కూడా పరిపాటిగా మారుతోంది.
ముఖ్యంగా మన దగ్గర నవదంపతులు లేదా ఆలుమగల మధ్య గొడవలకు కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అత్తింటి వేధింపులు, వరకట్నం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఈగోలకు పోవడం, ఇద్దరూ జాబ్ చేసే వ్యక్తులైతే కనీసం ఒకరికి ఒకరు మాట్లాడుకునేంత సమయం కేటాయించకపోవడం వల్ల వచ్చే మనస్పర్ధలు, నువ్వెంత అంటే నువ్వెంత అనే మనస్థత్వంతో పాటు మద్యం కూడా దంపతుల మధ్య విభేదాలకు దారితీయొచ్చు. మరికొన్ని సందర్భాల్లో పిల్లల పెంపకం, కేరింగ్, కెరీర్ డిజైన్ విషయంలోనూ దంపతుల మధ్య గొడవలు తలెత్తుతుంటాయి.
వీటన్నింటికీ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కానీ, ఈ మాత్రానికే దాంపత్య జీవితానికి ముగింపు పలకాలి అనుకుంటే ఇరువురిది పెద్ద తప్పిదమే అవుతుంది. ప్రస్తుత రోజుల్లో పిల్లల కాపురాలు చక్కదిద్దేందుకు పేరెంట్స్ నానా తంటాలు పడుతున్నారు. ఒక్కతే కూతురు, ఒక్కడే కొడుకు అని గ్రాండ్గా పెళ్లిళ్లు అయితే చేసేస్తున్నారు. ఆ తర్వాత వారి మధ్య వచ్చే గొడవలు సర్ది చెప్పలేక సగం అవుతున్నామని కొందరు బాధిత పేరెంట్స్ వాపోతున్నారు.
ఒకరిపైమరొకరికి నమ్మకం లేకనే :
ఒకప్పుడు దంపతుల మధ్య గొడవలకు కుటుంబాల నేపథ్యం, అత్తింటి వేధింపులు, మద్యం.. ప్రధాన కారణంగా కనిపిస్తుండేది. కానీ ప్రస్తుత టెక్ యుగంలో దంపతుల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు కాస్తా చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి.
కారణం అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ మితిమీరిన స్నేహభావం కలిగి ఉండటం, ఇతరులతో సన్నిహితంగా ఉండటం, అనుమానం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, పాశ్చాత్య సంస్కృతికి మత్తులో అమ్మాయిల వేషాధారణలో మార్పులు, పార్టీ కల్చర్ వంటివి, లేట్ నైట్ ఉద్యోగాలు కూడా దంపతుల మధ్య గొడవలకు కారణమని తెలుస్తోంది.
ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అధికంగా వినియోగించడం, సీక్రెసీలు కూడా దంపతుల మధ్య కలహాలకు ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు. అయితే, దంపతుల మధ్య తలెత్తే ప్రతీ వివాదాలకు పరిష్కార మార్గాలున్నాయి. కొందరు కౌన్సెలింగ్ తీసుకుంటుంటే, మరికొందరు ఆధ్యాత్మిక బాటలో నడిచి భార్యభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. డాక్టర్ వద్ద కౌన్సెలింగ్ తీసుకునేందుకు వెళ్లిన వారు డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
అప్పటికీ భార్య భర్తల మధ్య వివాదాలు సర్దుమణుగుతాయా? అంటే గ్యారెంటీ లేదు. కానీ, దైవారాధనతోనూ కొందరు దాంపత్య జీవితంలో ప్రశాంతతను పొందుతున్నారు. ఇందుకు పవిత్రంగా, నిష్ఠగా దేవుడిని ఆరాధించాల్సి ఉంటుంది. దంపతులిద్దరూ నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉంటే తప్పక ఫలితం ఉంటుందని ఇదివరకు ఆచరించిన వారు చెబుతున్నారు.
అర్థనారీశ్వరులను నిత్యం పూజిస్తూ ఉంటే.. :
దంపతుల పండంటి కాపురంలో కలహాలు ఏర్పడితే, వాటిని తగ్గించుకునేందుకు ఆది దేవతలు అయిన పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలని జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారు చెబుతున్నారు. అర్థ నారీశ్వరులను నిత్యం పూజిస్తూ ఉంటే తప్పక కలహాలు తొలగి ఆ ఇంట్లోని వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని సెలవిచ్చారు. అందుకోసం అర్థనారీశ్వరుల ఛాయాచిత్రం (ఫోటో) లేదా అర్థనారీశ్వర రుద్రాక్షను ఇంట్లో ఉంచి ప్రతీరోజు పూజించాలని చెప్పారు.
పంచాక్షరి మంత్రాన్ని జపించాలి :
భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా ఉదయం స్నానం ఆచరించి బ్రహ్మకాల ముహూర్తంలో అర్థనారీశ్వర చిత్ర పటానికి లేదా రుద్రాక్షకు పసుపు వేసి పూజించాలి. పూజ చేసే సమయంలో ‘ఓం నమహ్ శివాయా’ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇలా నిత్యం చేస్తూ ఉండటం వలన ఇంట్లో కలహాలు తొలగి దంపతులిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవడానికి ఆస్కార ముంటుంది.
ఇంకొక విషయం ఎంటంటే, ఆవు నెయ్యితో దీపం వెలిగించి దైవాన్ని ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. అయితే, కొందరికి రుద్రాక్షలను ఇంట్లో నుంచి పూజించాలంటే పలు అనుమానాలు కలుగవచ్చు. ఏదైనా అరిష్టం కలుగవచ్చునేమో అని భయాందోళనకు గురవుతుంటారు.
రుద్రాక్షను ఆడవారు తాకవచ్చా లేదా అనేది కూడా కొందరికీ సందిగ్దమే. అయితే, ఎలాంటి అనుమానం లేకుండా రుద్రాక్షాను ఇంట్లో ఉంచి ఆడ, మగ పూజిస్తే భార్యభర్తల మధ్య గొడవలు సమసిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో ఉందని పూజారులు, పండితులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని స్వయానా కైలాసంలో పార్వతి దేవికి ఆ పరమేశ్వరుడే చెప్పాడని కూడా సెలవిచ్చారు. ఇది సృష్టి రహస్యమని, భార్య భర్తల మధ్య ఎన్నిగొడవలు వచ్చినా ఇలా అర్థనారీశ్వరులను నిష్టగా ఆరాధిస్తే వారి కలతలు తొలగిపోయి సుఖ: శాంతులతో తులతూగుతారని శాస్ర్తం చెబుతోందని వివరించారు.
Read Also : Ayurvedic Remedies : వాసనను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి